కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటను ఆ రెండు నియోజకవర్గాల కూటమి నేతలు కాస్త తేడాగా అర్ధం చేసుకున్నారా? పని ఏదైతేనేం… కలిసి చేసుకుంటే ఇంకాస్త సుఖంగా ఉండవచ్చనుకుని పేకాట శిబిరాలకు తెర తీశారా? పార్టీలు వేరైనా… పంచుకోవడంలో సమ న్యాయం పాటిస్తున్నారా? పోలీసులు కూడా మాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదన్నట్టు ఉంటున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా పేకాట క్లబ్ల కహానీ? కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలు రెండూ పక్క పక్కనే, పెద్ద డిఫరెన్స్ కనిపించకుండా ఉంటాయి. సిటీ నుంచి టిడిపి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు, రూరల్ నుంచి జనసేన శాసనసభ్యుడు పంతం వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంత వరకు ఓకేగానీ… ఇప్పుడు అసలు సబ్జెక్ట్ పేకాట శిబిరాల గురించి. రెండు నియోజకవర్గాలలో ఇటీవల పేకాట శిబిరాల జోరు పెరిగిపోయిందట. అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో కార్డ్స్ గేమ్స్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.ఈ వ్యవహారాలను ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు దగ్గరుండి నడిపిస్తున్నారన్నది స్థానికంగా ఓపెన్ సీక్రెట్. నడిపించడం ఒక ఎత్తయితే… ఇందులో సమానత్వం పాటించడం గురించి ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఒక నియోజకవర్గంలో ఎక్కువ, రెండో చోట తక్కువ అన్నట్టు కాకుండా… రెండు చోట్ల పేకాట శిబిరాలు సరి సమానంగా ఉండాలని డిసైడ్ చేశారట. దానికి అనుగుణంగానే అనధికారిక అనుమతులు ఇచ్చినట్టు తెలిసింది. సాధారణంగా పేకాట క్లబ్ పెట్టిన వాళ్ళు దానికి సంబంధించిన కొందరికి మామూళ్ళు ఇస్తారు. వచ్చి ఆడి వెళ్లిపోయే వాళ్ళ నుంచి వసూళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ లెక్కలన్నిటినీ ఇద్దర ఎమ్మెల్యేలు అనుచరులు కలిసి సరిచేసుకుంటూ… మనం మనం భాయీ భాయీ అంటూ సమన్వయంతో నడిపిస్తున్నారట. మొదట్లో పేకాట నిర్వాహణపై కొంచెం గందరగోళం ఉండేది. ఆదాయం మొత్తం ఒకే నియోజకవర్గానికి వెళ్తోందన్న చర్చ జరిగింది. దాంతో… రెండు నియోజకవర్గాలు కలిసి ఉన్నప్పుడు వచ్చే ఆదాయాన్ని కూడా రెండ చోట్ల నాయకులు సమానంగా పంచుకోవాలని ఒక ప్రపోజల్ వచ్చిందంట. దాంతో ఒక అండర్ స్టాండింగ్కి వచ్చి అలా సెట్ చేసుకున్నట్టు తెలిసింది. ఇక వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నప్పుడు మనకెందుకులే అన్నట్టు పోలీసులు కూడా ఈ వ్యవహారాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో డైరెక్ట్గా ఎమ్మెల్యేల మనుషులు రంగంలోకి దిగితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే అంటూ సెటైర్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు.
కాకినాడ జిల్లా కేంద్రం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పేకాట ఆడతారు. ఇక వేరే పనేం లేదన్నట్టుగా…. 24 గంటలు కార్డ్స్ గేమ్లో మునిగితేలే జూద శిఖామణులకు కూడా ఇక్కడ కొదవలేదు. అందుకు అనుగుణంగా వారికి కావాల్సిన సకల సదుపాయాల్ని ఇక్కడే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. ఇలా.. అంతా ఒక పద్ధతి ప్రకారం ఇద్దరు ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు దగ్గరుండి పేకాట శిబిరాలను నడుపుతున్నారట. శిబిరం స్థాయిని బట్టి… మంత్లీ, వీక్లీ పేమెంట్స్ ఉంటాయని చెబిుతున్నారు. ఎవరైనా గడువు ముగిసి డబ్బులు కట్టకపోతే ఇక అక్కడ పేకాట జరగడానికి ఛాన్స్ లేనంత నిక్కచ్చిగా రూల్స్ ఉంటాయి. కాదు కూడదని ఎవరైనా మాట వినకుండా ముందుకుపోతే… వెంటనే పోలీస్ తనిఖీలు,కేసులు ఉంటాయన్నది ఇక్కడ అంతా చెప్పే మాట. పేకాట శిబిరం మీద పోలీస్ దాడులు, జూదరుల అరెస్ట్ అంటూ అప్పుడప్పుడూ వినిపించే వార్తలు ఆ బాపతేనట. అలా కాకుండా… ఎప్పటి పేమెంట్స్ అప్పుడు సెటిల్ అయిపోతుంటే… ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏ ఒక్క అధికారికీ కనిపించవని అంటున్నారు స్థానికులు.చాలా చోట్ల పోలీసులు మధ్యవర్తులుగా ఉండి రొక్కం వ్యవహారం చూస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
పైవాళ్లకు పంపాల్సింది పంపి మిగతాది వాళ్ల వాటాగా ఉంచుకుంటున్నారి చెప్పుకుంటున్నారు. వ్యసనాన్ని ఇలా ప్రోత్సహించడం తప్పు కాదా…? అని స్థానిక కూటమి నాయకుల్ని ఎవరైనా అడిగితే… వాళ్ళు కాస్త గడుసుగా సమాధానం చెబుతున్నారట. వాళ్ళకు వాళ్లు ఏదో…. సరదాగా అలా అలా… గేమ్ ఆడుకోవాలనుకున్నప్పుడు మనం మాత్రం ఎంటర్టైన్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అంటూ రివర్స్లో అడుగుతుండటంతో ప్రశ్నించిన వాళ్ళు నోరెళ్ళబెట్టాల్సి వస్తోంది. అయినా… ముఖ్య అనుచరులే దగ్గరుండి నడిపిస్తుంటే.. ఇవన్నీ ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటాయా అన్నది ఇంకొందరి క్వశ్చన్. మొత్తానికి కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పేకాట జోరుగానే జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేల పేరు చెప్పిమరీ… అనుచరులు కో ఆర్డినేట్ చేసుకుని డీల్ సెట్ చేస్తున్నారట. పోలీసులు కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారన్నది ఒక ఆరోపణ. వోవరాల్గా అధికారం అండదండలతో కాకినాడలో పేకాట అడ్డు అదుపు లేకుండా నడుస్తోందని అంటున్నారు.
