Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ వర్గపోరును మరింత బహిర్గతం చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా శృంగవరపుకోట రాజకీయాల్లో కోళ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కోళ్ల లలితకుమారి తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ప్రాధాన్యం కూడా పెరగడంతో వీరి మధ్య అంతర్గత విభేధాలు తారా స్థాయికి చేరాయని క్యాడర్లో టాక్. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలే ప్రస్తుత విభేదాలకు ప్రధాన కారణమన్న చర్చ కూడా నడుస్తోంది. పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లలో గొంప కృష్ణ ఫొటోకు చోటు కల్పించడం లేదట. ఈ అసంతృప్తి ఆయన అనుచరుల్లో ఉందని చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ గొంప కృష్ణ ఫొటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసిందని సమాచారం. ఐతే…వివాదం చెలరేగిన తర్వాత ఎక్కడో ఒక మూలన ఫొటోను జత చేసి చేతులు దులుపుకున్నారనే టాక్ అప్పట్లో నడిచిందట.
ఇక…ఇటీవల ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ గొంప కృష్ణ పాత్ర ఎక్కడా కనిపించలేదన్న చర్చ కేడర్లో సాగుతోంది. దీనిపై ఆరా తీస్తే, అసలు కార్యక్రమం గురించి తమకు సమాచారమే ఇవ్వలేదని గొంప వర్గం ఆవేదన వ్యక్తం చేసిందని గుసగుసలాడుకుంటున్నారు కార్యకర్తలు. ఐతే…ఈ విభేదాలకు ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా అద్దం పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీడీవో తీరును నిరసిస్తూ ఎంపీపీ వర్గం సమావేశానికి దూరంగా ఉండగా, కోరం సమస్య తలెత్తే పరిస్థితుల్లో టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు గొంప తులసి హాజరుకావడంతో సమావేశం జరిగింది. ఈ పరిణామం పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బల్లంకి గ్రామంలో నిర్వహించిన వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు గైర్హాజరు కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మండల టీడీపీ అధ్యక్షుడు గొంప వెంకటరావు దంపతుల వ్యవహార శైలిపై అసంతృప్తితోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కంటే వర్గ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లోపించడం రానున్న రోజుల్లో రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శృంగవరపుకోట టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపునకు దారితీస్తాయోనన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పార్టీ అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని పరిష్కరిస్తుందా?లేకుంటే మీలో మీరే తన్నుకు చావండని వదిలేస్తుందా?అనేది చూడాలి మరి.

