Off The Record: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీలో గ్రూప్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇక్కడ నియోజకవర్గ కో ఆర్డినేటర్గా పొన్నాడ సతీష్ ఉన్నారు. గత ఎన్నికలకు ముందు జనసేన నుంచి పితాని బాలకృష్ణ పార్టీలో చేరారు. 2019లో ఆయన వైసీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరిపోయారు. ముమ్మిడివరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మిడివరం సీటు మీద గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఐతే…పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి టీడీపీ పోటీ చేసింది. దాంతో మళ్లీ ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు పితాని బాలకృష్ణ. నిలకడ లేకపోవడంతో ఆయన పొలిటికల్గా పెద్దగా సక్సెస్ కాలేదనేది పార్టీ సర్కిల్స్లో టాక్. అయితే ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ బీసీ సామాజికవర్గ నేతలే. పొన్నాడ మత్య్సకార సామాజికవర్గం కాగా, పితాని బాలకృష్ణ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను డివైడ్ చేసి రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. నిజానికి…పైకి అంతా బాగానే ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించినట్లుగా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. దాంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఫ్యాన్ పార్టీలో రాజకీయం గజిబిజిగా మారిందట.
ఈ ఇద్దరు నేతలు 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. పొన్నాడ సతీష్ విజయం సాధించారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి ఎదుగుదల కోసం వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని టాక్. ఈసారి ముమ్మిడివరం సీటు తమదంటే తమదని ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారట. త్వరలోనే సతీష్కు చెక్ పెడతారని…పార్టీ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని బాలకృష్ణ వర్గం ప్రచారం చేసుకుంటోంది. పితాని బాలకృష్ణకు అంత సీన్ లేదని, నిలకడలేని రాజకీయాలు చేస్తారని సతీష్ వర్గం ఎదురు దాడికి దిగుతోందనేది ఇన్సైడ్ టాక్. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న లోపల మాత్రం క్యాడర్ డివైడ్ అయిపోతున్నారట. అపోజిషన్లో ఉండి యూనిటీగా పని చేయాల్సింది పోయి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. కొందరు లోకల్ లీడర్లు ఈ రాజకీయాలు మనం చేయలేమంటూ సైడ్ అయిపోతున్నారు. ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఏం ఇస్తామని పెదవి విరుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.
కూటమిని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి సొంత ప్రయోజనాలు కోసం పరుగులు పెడుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారట పార్టీ క్యాడర్. అయినప్పటికీ నేతల తీరులో మాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. పార్ట్ టైంగా పార్టీలోకి వచ్చి ఫుల్ టైం గొడవలు పెట్టి వెళ్లిపోతున్నారనేది కార్యకర్తల మనసులో మాట. మొత్తానికి ముమ్మిడివరం వైసీపీలో సమన్వయం లోపించిందని స్వయంగా పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితికి వచ్చిందని సమాచారం. కోఆర్డినేటర్కి ఎన్నికల ముందు వచ్చిన నేతకు మధ్య సరిగా పొసగడంలేదు. పైకి మాత్రం ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంటర్నల్గా ఎవరి ఆధిపత్యం కోసం వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

