Kim Jong Un: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో భీకర పోరాటం సాగుతోంది. ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల్లో అనేక మంది ప్రజలు మరణించారు. కీలక అధినేతలు సైతం మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా నిర్మించిన భారీ యుద్ధ నౌకతో మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వ్యూహాత్మక క్షిపణులను ప్రయోగిస్తూ తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించాడు. అధికారిక సమాచారం ప్రకారం.. సుమారు ఐదు వేల టన్నుల బరువు కలిగిన కొత్త యుద్ధ నౌకను వినియోగంలోకి తీసుకొచ్చే ముందు ఈ ప్రయోగాలను నిర్వహించారు. నాంపో నౌకాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కిమ్ స్వయంగా పర్యవేక్షించడం హాట్ టాపిక్గా మారింది.
READ MORE: Nothing Phone (4a) Pro: 5080mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో.. Nothing Phone (4a) Pro రిలీజ్..
ఈ యుద్ధ నౌకను పరీక్షించేందుకు ఇందులో నుంచి సముద్రం మీదున్న లక్ష్యాలపై దాడి చేసే క్షిపణులను ప్రయోగించారు. ఈ పరీక్షల ద్వారా కొత్త నౌక యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించామని ఉత్తర కొరియా ప్రభుత్వ మాధ్యమాలు వెల్లడించాయి. ఈ అంశంపై కిమ్ సైతం స్పందించారు. ఈ నౌక తమ దేశ సముద్ర రక్షణకు కొత్త ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నీటి అడుగు నుంచే కాకుండా.. నీటి పైభాగం నుంచి కూడా దాడి చేసే శక్తి తమ నౌకాదళానికి ఉందని వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర దళాన్ని అణు ఆయుధాలతో బలోపేతం చేసే ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని తెలిపారు. “ఈ విజయాలతో మా దేశ సముద్ర రక్షణ విధానంలో పెద్ద మార్పు వచ్చింది. దాదాపు యాభై సంవత్సరాలుగా సాధించలేని స్థాయిలో ఇప్పుడు సముద్ర సార్వభౌమత్వాన్ని రక్షించే శక్తి పెరిగింది. కొత్తగా నిర్మిస్తున్న యుద్ధ నౌకల శ్రేణిలో ఇది తొలి నౌకగా భావిస్తున్నాం.” అని వెల్లడించారు. ఈ నౌకను పరిశీలించేందుకు కిమ్ రెండు రోజుల పాటు నాంపో నౌకాశ్రయాన్ని సందర్శించారు. ఈ కొత్త ఆయుధం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉండగా.. అమెరికా, దక్షిణ కొరియా నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోవాలంటే శక్తివంతమైన నిరోధక శక్తి అవసరమని ఉత్తర కొరియా చాలా కాలంగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే అణు ఆయుధాలు, క్షిపణులు, నౌకాదళ శక్తి అభివృద్ధికి ఆ దేశం నిరంతరం ప్రాధాన్యం ఇస్తోంది. తాజా క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా సముద్ర రక్షణ వ్యవస్థలో కొత్త దశ ప్రారంభమైందనే సందేశాన్ని ప్రపంచానికి పంపించింది.
