OTR: కంట్లో నలుసు..

  • మారుతున్న నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ముఖచిత్రం..
  • ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, డీసీసీ నగేష్‌రెడ్డి..
  • పట్టు కోసం ఎవరికి వారే పర్యటనలు, ప్రయత్నాలు ..
  • పర్మిషన్‌ లేకుండా అడుగుపెట్టవద్దన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి..
  • డీసీసీ అధ్యక్షుడి హోదాలో నగేష్‌రెడ్డి టూర్స్‌..
  • స్వగ్రామం కేంద్రంగా డీసీసీ అధ్యక్షుడి రాజకీయం..
  • ఎస్‌ఐఆర్‌ ఇన్ఛార్జ్‌ సాకుతో ఆకుల లలిత పర్యటనలు..
  • నియోజకవర్గాల పెంపుపై నేతల ఆశలు
Untitled 1 Copy

Untitled 1 Copy

సిట్టింగ్‌ ఎమ్మెల్యే… మాజీ ఎమ్మెల్యే….మధ్యలో డీసీసీ అధ్యక్షుడు. అదీ స్టోరీ. ఎవరికి వారు ఈసారి ఆ నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. నన్ను అడక్కుండా నియోజకవర్గంలో కాలు పెట్టవద్దని ఎమ్మెల్యే అంటుంటే… అబ్బ ఛా…. అంతుందా…? మా టూర్‌ మా ఇష్టం అంటున్నారు మిగతావాళ్ళు. ఏంటా ట్రయాంగిల్‌ పొలిటికల్‌ స్టోరీ? ఎవరా ముగ్గురు నాయకులు?

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మారుతున్న పరిణామాలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు అంతకంతకూ పెరుగుతూ ఆసక్తికరంగా మారుతోంది. లలిత గతంలో రూరల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొద్ది రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న నాయకురాలికి ఎస్.ఐ.ఆర్. రూరల్, అర్బన్ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది హస్తం హైకమాండ్‌. కానీ… ఆమె మాత్రం అర్బన్ కంటే ఎక్కువగా రూరల్ లోనే పర్యటిస్తున్నారట. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో.. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆ రకంగా పర్యటించడాన్ని తాజా ఎమ్మెల్యే భూపతి రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. అందుకే తనకు సమాచారం లేకుండా రూరల్ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దంటూ హుకుం జారీ చేశారట డాక్టర్ సాబ్.

మాజీ ఎమ్మెల్యే వెంట వెళ్లొద్దంటూ తన అనుచరులు, ముఖ్య నేతలకు చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే….. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి రూపంలో ఎమ్మెల్యేకు మరో సమస్య వచ్చిందట. జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన కూడా రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ పర్యటిస్తుండటం భూపతిరెడ్డికి మింగుడు పడ్డంలేదని అంటున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా…. రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారిపై నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది డీసీసీ. అయితే… తాను లేకుండా.. కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో… ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారట. ఈ అంశం అధికార పార్టీలో చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో రూరల్ టికెట్టు కోసం భూపతి రెడ్డి, నగేష్ రెడ్డి మధ్య చివరి వరకు వార్ నడిచింది. ఐతే అధిష్టానం భూపతిరెడ్డికి సీటిచ్చి…. నగేష్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరగ్గా…. ఇప్పుడు అది మరింత పీక్స్‌కు వెళ్ళిందన్నది పార్టీ వర్గాల మాట. రూరల్ నియోజకవర్గానికే చెందిన నగేష్ రెడ్డి ఎప్పటికైనా ఇక్కడ పట్టు బిగించాలన్న లక్ష్యంతో ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తున్నారట. తన స్వగ్రామాన్ని వేదికగా చేసుకుని తరచూ పర్యటిస్తూ, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని మీదే సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారన్నది ఆయన ప్రశ్న. కానీ… డీసీసీ అధ్యక్షుడి హోదాలో జిల్లా మొత్తం మీద ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందన్నది నగేష్‌రెడ్డి వాదన.

ఇద్దరి మధ్య ఇలా ఆధిపత్య పోరు నడుస్తుంటే.. సందట్లో సడేమియా అన్నట్లుగా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ఎస్‌ఐఆర్‌ సాకుతో ఆదే నియోజవకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తుండటం మరింత వివాదంగా మారుతోంది. ఇలా ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ నలిగిపోతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారే పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్యలో డీసీసీ ప్రెసిడెంట్‌ అన్నట్టు మారిపోయింది నిజామాబాద్‌ రూరల్‌ రాజకీయం.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో రాజకీయం ఇలా తయారవడం పార్టీలో కూడా దుమారం రేపుతోంది. మరోవైపు నియోజకవర్గాల పెంపు ఆశలతో నేతలవు ఎవరికి వారు తగ్గడం లేదు. ఇప్పుడు గట్టిగా పట్టుకుంటేనే రేపు పెరిగాక కూడా మనం రేస్‌లో ఉంటామన్న ఆలోచనతో ఎవరికి వారు పావులు కదుపుతుండటంతో ఎవర్ని సపోర్ట్‌ చేయాలో అర్ధంగాక రూరల్‌ కాంగ్రెస్‌ కేడర్‌ గందరగోళంలో ఉంది. వీలైనంత త్వరాగ ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెట్టమంటూ పార్టీ పెద్దల్ని కోరుతున్నారు.