Andhrapradesh: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ ప్రతినిధుల బృందం

Niti Aayog

Niti Aayog

Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ, నీతి ఆయోగ్‌ ప్రతినిధుల బృందం పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌లు కలిశారు. సీఎంతో వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు.

నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని సీఎం అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్‌ – సీపోర్ట్‌ కనెక్టివిటీ రోడ్, ఆదానీ డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్‌ మాల్, సబ్‌మెరైన్‌ మ్యూజియం ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందన్నారు. అంతేకాక ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యరంగం, విద్యారంగం, నాడు నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Also Read: AP CM Jagan: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్

ఏపీలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్‌ బృందం అభినందించింది. ఇదంతా కూడా డాక్యుమెంటరీ రూపంలో తమకు అందజేయాలని ముఖ్యమంత్రిని కోరింది. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని నీతి ఆయోగ్‌ బృందం వెల్లడించింది.