New FASTag Rules: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేశారు. దీంతో FASTag లేని వారు లేదా రీఛార్జ్ చేయని వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు: కొత్త రూల్స్ ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద FASTag ప్రధాన చెల్లింపు పద్ధతిగా మారింది. వాహనదారుల వద్ద చెల్లుబాటు అయ్యే FASTag లేకపోతే, వారు UPI ద్వారా చెల్లించవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో అసలు టోల్ మొత్తానికి 1.25 రెట్లు వరకు చార్జ్ వసూలు చేయబడుతుంది.
FASTag లేకపోతే ఏమవుతుంది?: మీ వాహనానికి FASTag లేకపోతే.. నగదు చెల్లింపులు అంగీకరించరు.. అయితే, UPI ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.. టోల్ మొత్తంపై అదనంగా 25 శాతం సెస్ విధించబడుతుంది.. దీంతో ఎక్కువసేపు ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది..
బ్లాక్లిస్ట్ ట్యాగ్ అయితే రెట్టింపు టోల్: FASTag ఉన్నా, అది బ్లాక్లిస్ట్ అయి ఉంటే లేదా కనీస బ్యాలెన్స్ లేకపోతే FASTag లేన్లో ప్రవేశించినప్పుడు రెట్టింపు టోల్ వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే సమయానికి రీఛార్జ్ చేసుకోవడం అవసరం.
చెల్లించకపోతే ఈ-నోటీసు: టోల్ ప్లాజా వద్ద డిజిటల్ చెల్లింపు విఫలమైతే, సంబంధిత వాహన యజమానికి ఈ-నోటీసు జారీ చేస్తారు. మూడు రోజులలోపు చెల్లింపు చేయకపోతే, బకాయి మొత్తం రెట్టింపు కావచ్చు.
15 రోజుల తర్వాత మరిన్ని ఇబ్బందులు: చెల్లింపులు 15 రోజులకుపైగా పెండింగ్లో ఉంటే, వాహన డేటాబేస్లో నమోదు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్, యాజమాన్య బదిలీ వంటి సేవలపై పరిమితులు విధించే అవకాశం ఉంది.
టోల్ ఛార్జీలు కూడా పెరిగాయి: 2026-27 ఆర్థిక సంవత్సరానికి టోల్ రేట్లు సవరించబడ్డాయి. అలాగే వార్షిక FASTag పాస్ ధర ₹3,000 నుంచి ₹3,075కు పెరిగింది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది.
వెంటనే FASTag రీఛార్జ్ చేసుకోండి: టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే, మీ FASTag యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకుని వెంటనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. లేదంటే అదనపు టోల్ చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాహనదారులు FASTag వినియోగంపై అవగాహన పెంచుకుని, ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి.
