Nepal Gorkhas: భారత సైన్యంలో చేరే అవకాశం కోసం నేపాల్ యువత, పూర్వ గోర్ఖా సైనికులు రోడ్డెక్కారు. తమ దేశపు యువతను భారత సైన్యంలోని ‘అగ్నిపథ్’ పథకం కింద ఎంపిక చేసుకునే ప్రక్రియను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేపాల్లోని పోఖరా నగరంలో విస్త్రుత నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనల వెనుక తరతరాల చరిత్ర, వేలాది కుటుంబాల ఉపాధి ఆశలు దాగి ఉన్నాయి. 1815లో సుగౌలీ ఒప్పందం కాలంతో పాటు ఆ తర్వాత 1947 భారత స్వాతంత్ర్యం నుంచి కూడా నేపాల్ గోర్ఖాలు భారత సైన్యంలో చేరి అపారమైన శౌర్యప్రతాపాలు చూపిస్తున్నారు. దాదాపు 207 ఏళ్లకు పైగా నిరాటంకంగా సాగిన ఈ సుదీర్ఘ సంప్రదాయానికి 2020లో కరోనా మహమ్మారి వల్ల తాత్కాలికంగా విరామం పడింది. అయితే, 2022లో భారత్ తీసుకొచ్చిన సైనిక నియామక నమూనా ‘అగ్నిపథ్’ ఈ విరామాన్ని కాస్తా వివాదంగా మార్చేసింది. ఈ నూతన విధానం కింద అగ్నివీరులుగా చేరేవారు నాలుగేళ్లు మాత్రమే సేవలు అందిస్తారు. ఆ తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే పూర్తిస్థాయి సేవలకు ఉంచుకుంటారు. తక్కువ కాలపరిమితి, పదవీ విరమణ తర్వాత సైనికుల భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, పూర్వపు త్రైపాక్షిక ఒప్పందాలకు ఇది భిన్నంగా ఉందనే కారణాలతో నేపాల్ ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ను నిలిపివేసింది.
ప్రస్తుతం ‘ఇండియన్ ఎక్స్-సర్వీస్మెన్ గోర్ఖా బ్రిగేడ్ నేపాల్’ ఆధ్వర్యంలో మాజీ సైనికులు, వారి కుటుంబాలు, మిలిటరీ శిక్షణ పొందుతున్న యువకులు పోఖరాలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిపాలనా అధికారి ద్వారా నేపాల్ ఫెడరల్ ప్రభుత్వానికి రెండు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అగ్నిపథ్ కింద నియామకాలు వెంటనే ప్రారంభించాలని, అలాగే తమ పేర్లలో ‘సైనికుడు’ (Soldier) అనే పదాన్ని ఉపయోగిస్తున్న మాజీ సైనిక సంస్థల గుర్తింపును పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ ఆందోళనలో పాల్గొన్న బ్రిగేడ్ ఛైర్మన్ కల్నల్ కృష్ణ బహదూర్ ఖత్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోవడమే కాకుండా, మన పూర్వీకులు రక్తం చిందించి సంపాదించుకున్న వీరత్వ చరిత్ర తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. నాలుగేళ్ల అగ్నిపథ్ కాలంలోనే యువకులు దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చని వినతిపత్రంలో పేర్కొన్నారు. 50 డిగ్రీల తీవ్రమైన ఎండలో గల్ఫ్ దేశాలకు వెళ్లి అల్ప వేతనానికి కష్టపడటం కంటే, భారత సైన్యంలో చేరడం వంద రెట్లు మెరుగైన ఉపాధి మార్గమని స్పష్టం చేశారు.
మరోవైపు, భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. భారతీయులకు ఒక నియమం, నేపాల్ పౌరులకు మరొక నియమం పెట్టలేమని, అగ్నిపథ్ విధానంలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయని పూర్వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ గతంలోనే వెల్లడించారు. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది నేపాల్ ప్రభుత్వమేనని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు.. ఈ ఉద్రిక్తతల మధ్యే భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేథ్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నేపాల్ ప్రెసిడెంట్ రామ్చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ‘జనరల్ ఆఫ్ ది నేపాలి ఆర్మీ’ గౌరవ హోదాను అందుకోనున్నారు. అలాగే నేపాల్ ప్రధాని బాహెంద్ర షాను కూడా కలిసే అవకాశం ఉంది. ఒకవైపు దశాబ్దాల సైనిక మైత్రి సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుండగా, మరోవైపు ఉపాధి ఆశలతో ఉన్న గోర్ఖా యువత తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

