నేపాల్లో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా పలువురి జాడ కనిపించలేదు. దీంతో ఆత్మీయుల రాక కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక పలువురి భారతీయుల సమాచారం కూడా తెలియడం లేదు. ప్రస్తుత పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఇక నేపాల్లోని ప్రస్తుత పరిణామాలపై కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. రసువాలోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి శనివారం నలుగురు భారత పౌరులను రక్షించినట్లు వెల్లడించింది. త్వరలో వారంతా ఖాఠ్మాండుకు చేరుకుంటారని భావిస్తున్నట్లు తెలిపింది. 1. రిపు కుమార్, 2. చనేశ్వర్ నార్జరీ, 3. కృపా శంకర్, 4. మహమ్మద్ మిన్హాజుద్దీన్ క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది.
ఫోరెన్సిక్ బృందాలు..
ఇక మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయపడటానికి భారతదేశం నుంచి ఆరు ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఖాఠ్మాండ్కు చేరుకుంటాయని కేంద్రం తెలిపింది.
టన్నెల్ బృందం
టన్నెల్ రెస్క్యూ రికనైసెన్స్ కోసం ఒక ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాఠ్మాండ్కు చేరుకుంది. ప్రభావిత ప్రాంతంలో టన్నెల్ రెస్క్యూలో సహాయపడటానికి శనివారం నుంచి పని ప్రారంభించాయి. సిఫార్సు ఆధారంగా.. పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం నేపాల్కు చేరుకుంంది. ఈరోజు 120 మంది భారత పౌరులు చైనా నుంచి నేపాల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
నేటి వరకు గణాంకాలు ఇవే..
రక్షించబడిన భారత పౌరులు-88
గల్లంతైన భారత పౌరులు-287
గల్లంతైన భారత సంతతికి చెందిన వ్యక్తులు-128

