NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

Neet Ug 2026 Exam Cancelled

Neet Ug 2026 Exam Cancelled

NEET UG 2026: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష ‘నీట్ యూజీ (NEET UG) 2026’ రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ‘గెస్ పేపర్’ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్ష పారదర్శకతపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించడంతో పరీక్షా విధానం అపహాస్యం కాకూడదనే ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐ (CBI)కి అప్పగించింది. ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో సీబీఐ సమగ్ర విచారణ జరపనుంది. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులు, డేటాను ఎన్టీఏ స్వయంగా సీబీఐకి అందించనుంది.

పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని తెలిసినా, రాజీ పడితే వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అందుకే త్వరలోనే రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థులు దీనికోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత వివరాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు, అలాగే అదనపు ఫీజు కట్టాల్సిన పని లేదని తెలిపింది. పైగా ఇదివరకు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని, త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా, కేవలం అధికారిక సమాచారాన్నే ఫాలో అవ్వాలని ఎన్టీఏ సూచించింది. దేశంలోనే అత్యంత పోటీతో కూడిన నీట్ పరీక్ష భద్రతపై మరోసారి చర్చ మొదలైనప్పటికీ, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ సంకేతం విద్యార్థుల్లో భరోసా నింపుతోంది.