బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 262 రన్స్కు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, రవి అశ్విన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవర్నైట్ స్కోరు 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17 లియోన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్.. టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ఆపై విరాట్ కోహ్లీ(44)తో కలిసి రవీంద్ర జడేజా (26) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్కు 59 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేశాక జడేజాను మర్ఫీ ఔట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ, భరత్ (6) ఔట్ అవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న బాపు, అశ్విన్..
139 రన్స్కే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74) , రవి అశ్విన్ (71 బంతుల్లో 37) జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. అశ్విన్ నెమ్మదిగా సపోర్ట్ ఇవ్వగా.. అక్షర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్బోర్డును కదిలించాడు. ఏడో వికెట్కు 114 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశాక వరుస ఓవర్లలో అశ్విన్, అక్షర్ పెవిలియన్ చేరారు. అశ్విన్ను కమిన్స్ ఔట్ చేయగా.. అక్షర్ను మర్ఫీ బోల్తా కొట్టించాడు. అప్పటికే భారత్ స్కోరు 259. ఆసీస్ కంటే మరో 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. కాసేపటికే షమీ (2) కూడా వెనుదిరగడంతో 262 రన్స్ వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో ఆసీస్కు ఒక రన్ లీడ్ లభించింది. కంగారూ బౌలర్లలో లియోన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. మర్ఫీ, కునేమన్ చెరో రెండు వికెట్లు, కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: Naseem Shah: PSL మ్యాచ్కు BPL హెల్మెట్.. పాక్ క్రికెటర్కు జరిమానా