Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ మౌలాలిలో డ్రగ్ తయారీ కేంద్రంపై సోదాలు నిర్వహించింది. రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. 69.600 కిలోల అల్ప్రజోలామ్ను స్వాధీనం చేసుకుంది. ఎఫెడ్రిన్ డ్రగ్ తయారీ ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములలో భారీగా డ్రగ్ మెటీరియల్ నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. రెండు డ్రమ్ముల నుండి మొత్తం 69.600 కిలోల ఆల్ప్రజోలామ్ను గుర్తించారు. ఆల్ప్రజోలామ్తో పాటు, ఆల్ప్రజోలామ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్ కోసం వాడే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కెమిస్ట్, మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి, మెటీరియల్ తరలించే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఆల్ప్రజోలామ్ను వేసవిలో అధిక డిమాండ్ ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయించనున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురి నిందితులపై NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. అల్ప్రజోలామ్ (Alprazolam) వంటి మత్తు బిళ్ళలను కల్లులో కలపడం తీవ్రమైన నేరం. కల్లులో నిషా పెంచడానికి కొందరు అక్రమంగా ఈ బిళ్ళలను కలుపుతుంటారు. ఇలా కల్లును కల్తీ చేయడం ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి.. అల్ప్రజోలామ్ ఒక సెడెటివ్ డ్రగ్ (నిద్ర కోసం వాడే మందు). దీనిని ఆల్కహాల్తో కలిపి తీసుకున్నప్పుడు మెదడు, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కలయిక వల్ల శ్వాస ఆగిపోవడం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మోతాదు ఎక్కువైతే మనిషి కోమాలోకి వెళ్లవచ్చు లేదా మరణించవచ్చు.
