NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాట‌ల హోరే!

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu returned to commentary for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2024లో సిక్స‌ర్ల సిద్దూ కామెంటేట‌ర్‌గా వ్యవహరించనున్నారు. ‘స్టార్ స్పోర్ట్స్’ త‌ర‌ఫున‌ సిద్దూ కామెంటేట‌ర్‌గా అలరించనున్నారు. ఈ విష‌యాన్ని స్టార్ స్పోర్ట్స్ మంగ‌ళ‌వారం తన ఎక్స్ వేదిక‌గా తెలిపింది. సిద్దూను ‘స‌ర్ధార్ ఆఫ్ కామెంటరీ బాక్స్‌’గా పేర్కొంది. సిద్ధూ త‌న మాట‌లతో అలరిస్తారన్న విషయం తెలిసిందే.

టీమిండియా మాజీ క్రికెట‌ర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారత్ తరఫున 187 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 15 సంవత్సరాల కెరీర్‌లో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడి.. వరుసగా 3202, 4413 పరుగులు చేశాడు. సిద్ధూ 15 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు చేశారు. సిద్ధూ త‌న ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు. 1983 నుంచి 1998 వరకు భారత్ తరపున ఆడాడు. ఆట‌కు దూర‌మ‌య్యాక రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న‌ సిద్దూ.. ఇప్పుడు మరోసారి త‌న మాట‌లతో స్టేడియాన్ని హోరెత్తించ‌డానికి సిద్ధమయ్యారు.

Also Read: PSL 2024: మ్యాచ్‌ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెట‌ర్.. వీడియో వైరల్‌!

60 ఏళ్ల నవజ్యోత్ సింగ్ సిద్ధూ కామెంటరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2001లో భారత్, శ్రీలంక పర్యటనలో సిద్ధూ కామెంటరీ చేశారు. తన విలక్షణమైన మాటలతో అందరిని అలరించారు. చమత్కారమైన మాటలకు ప్రసిద్ధి చెందిన సిద్ధూ.. ఐపీఎల్ 2024లో ఎలా అలరిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాను ఆడిన రోజుల్లో భారతదేశపు అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకడిగా సిద్ధూ పేరుగాంచారు.