తెలుగు వెండితెరపైకి మరో వైవిధ్యభరితమైన సరికొత్త చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయి అభిషేక్ నిర్మాణంలో, యువ దర్శకుడు గొండి మణితేజ కథ, స్క్రీన్ప్లే అందిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఓరి నాయనో”. ఈ సినిమాకి ‘Every life will have Ori..Nayano! Moment’ అనే క్రేజీ ట్యాగ్లైన్ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్తో పాటు, నూతన చిత్ర కార్యాలయాన్ని ప్రముఖ వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై గ్రాండ్గా ఆవిష్కరించారు. మాదాపూర్లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ‘మా ఊరి పొలిమెర’ చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్, ప్రముఖ నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, డీఓపీ వెట్రి పళనిస్వామి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. “ప్రతి గొప్ప ప్రయాణం నమ్మకంతోనే మొదలవుతుంది. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమం నా హృదయానికి ఎంతో దగ్గరైన ఒక అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పడిన మొదటి అడుగు. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు, థియేటర్ల నుంచి బయటకు వచ్చినా గుర్తుండిపోయే పాత్రలను, క్షణాలను ఈ సినిమా ద్వారా అందిస్తాం” అని నమ్మకంగా చెప్పారు. “ఓరి నాయనో” చిత్రం వినోదం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, నేటి ఆధునిక సమాజాన్ని ప్రతిబింబించే పాత్రల సమ్మిళితంగా సరికొత్త అనూహ్య మలుపులతో సాగబోతోంది. ఈ విభిన్నమైన టైటిల్ ఇప్పటికే సినీ లవర్స్లో మంచి కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి రోహిత్ కంభంపాటి, డా. ప్రవీణ్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఎ. సుభాష్ నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు.

