National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?

National Flag Day

National Flag Day

National Flag Day: ప్రతి ఏటా జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవం (National Flag Day) జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్య రాకముందు, అంటే సరిగ్గా కొన్ని రోజుల ముందే జూలై 22న రాజ్యాంగ పరిషత్ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. భారతీయుల ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే మన మువ్వన్నెల జెండాను గౌరవించుకోవడానికి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైనది. మన జాతీయ జెండాను ‘తిరంగా’ అని పిలుస్తారు. ఇందులో సమానమైన వెడల్పు కలిగిన మూడు రంగుల పట్టీలు ఉంటాయి. పైన ఉండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి చిహ్నం అయితే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ సమృద్ధికి, అభివృద్ధికి సూచిక. శ్వేత వర్ణ పట్టీ మధ్యలో నివిల రంగులో ఉండే 24 ఆకులతో కూడిన అశోక చక్రం ధర్మచక్రానికి, దేశ నిరంతర పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3 లో ఉంటుంది. స్వాతంత్ర్యానికి కొద్ది వారాల ముందు జెండా డిజైన్‌లో ఓ ముఖ్యమైన మార్పు చేశారు. అంతకుముందు స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ, ఆత్మనిర్భరతకు గుర్తుగా ఉన్న ‘చరఖా’ (రాట్నం) స్థానంలో అశోక చక్రాన్ని చేర్చారు. బద్రుద్దీన్ త్యాబ్జీ సూచించిన ఈ మార్పును మహాత్మా గాంధీ కూడా సంపూర్ణంగా ఆమోదించారు.

మరోవైపు 2002లో భారత ప్రభుత్వం జెండా నిబంధనలలో (Flag Code of India) సవరణలు చేసింది. అంతకుముందు కేవలం జాతీయ పండగల సమయంలోనే ప్రజలు జెండాను ఎగురవేసే అవకాశం ఉండగా, ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశ పౌరులు ఏడాది పొడవునా పూర్తి గౌరవప్రదంగా జాతీయ జెండాను ఎగురవేసే హక్కును పొందారు. అయితే, సాధారణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే జెండాను ఎగురవేయాలి (రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉంటేనే అనుమతి ఉంటుంది). ఇక, దేశ స్వాతంత్ర్య పోరాటం, త్యాగాలు, ఆదర్శాలను గుర్తుచేసే ఈ రోజున పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాకు వందనం చేస్తూ దాని విశిష్టతను చాటిచెబుతారు. ప్రతి భారతీయుడికి తన దేశం పట్ల ఉండే ఐక్యతను, బాధ్యతను ఈ రోజు నిరంతరం గుర్తుచేస్తుంది.