అవసరానికి వాడుకుని ఆనక కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారంటూ అక్కడ ఓ సామాజికవర్గం లీడర్స్ బాగా ఫ్రస్ట్రేట్ అవుకున్నారట. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అంతా అలాగే చేస్తున్నారంటూ ఆ కులం లీడర్స్లో అసహనం పెరిగిపోతోంది. నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు ఉన్నా… పదవులు మాత్రం దక్కలేదని ఏ సామాజికవర్గం లీడర్స్ అంటున్నారు? వాళ్ళ ఆవేదనకు ప్రధాన కారణం పదవులేనా? ఇంకేమాన ఉందా..? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజిక వర్గ నేతలంతా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట. తమవారి ఓట్లు నియోజకవర్గాన్ని శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రాధాన్యత విషయంలో అన్నీ పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మమ్మల్ని తొక్కేస్తున్నారు, కీలక పదవులు ఇవ్వడం లేదు అంటూ…. నరసాపురం కాపు నేతలంతా కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం.
ఇంతకీ… ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు నేతలకు వచ్చిన కష్టమేంటి? పదవులు దక్కలేదన్న అసంతృప్తి సహజమేగానీ… ఆ స్థాయిలో ఎందుకు బరస్ట్ అయిపోతున్నారంటే… అందుకు ప్రత్యేక కారణాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం లోకల్ ఎమ్మెల్యేగా జనసేన తరఫున బొమ్మిడి నాయకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనది మత్స్యకార సామాజిక వర్గం. టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజుది క్షత్రియ సామాజిక వర్గం. ఇక ప్రతిపక్షం వైసీపీ ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు కూడా క్షత్రియుడే. కానీ… ఇక్కడ మెజార్టీ ఓటర్లు, డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కాపులు. అందుకే…. ఓట్లు మావి, పదవులు వేరే వాళ్ళకా అంటూ… నరసాపురం కాపు నాయకులు మండిపడుతున్నారట. మాకు రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవుల్ని ఏ ఒక్కపార్టీ ఇవ్వడం లేదంటూ కాపు నాయకుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందంటున్నారు.
కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్లు కూడా ఇవ్వకుంటే ఇక మేం ఎందుకని నిర్వేదంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో తమకు గుర్తింపు దక్కేలా చేసుకోకపోతే నష్టం తప్పదని లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. లోకల్గా గెలుపు ఓటములను ప్రభావితం చేయగల కాపు సామాజికవర్గం నేతలు ఉన్నా పట్టించుకోవడం లేదని, కనీసం వచ్చే ఎన్నికలలో అయినా వాళ్ళకు ప్రాధాన్యత దక్కుతుందా లేదా అని చర్చించుకుంటున్నారట. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో పాటు గత ఎన్నికల్లో టిడిపి తరఫున సీటు ఆశించిన ఎన్నారై కొవ్వలి నాయుడు, ప్రస్తుత డీసీఎంఎస్ చైర్మన్, జనసేన నేత చాగంటి మురళీకృష్ణ ఇలా…చాలా మంది తమకు రాజకీయ ప్రాధాన్యం కోసం పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణల్లో… తమకు ప్రాధాన్యత కల్పించకపోతే ఎలా నష్టపోతామో… ఈ నేతలంతా తమ అధిష్టానాలకు లెక్కలు చెప్పి మరీ వివరిస్తున్నారట.
ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో పాటు టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు కూడా మమ్మల్ని కావాలనే దూరం పెడుతున్నారంటూ కాపు నేతలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. అలా ఎందుకు చేస్తున్నారు? ఎక్కువ ఓట్లున్న, బలమైన సానాజికవర్గం లీడర్స్ని ఎవరైనా దూరం చేసుకుంటారా అని ప్రశ్నిస్తే… అందుకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయంటూ… ఇద్దరు కూటమి నేతల్ని ఉద్దేశించి అంటున్నారు. నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానివే ఎక్కువ ఓట్లు కావడంతో… ఇప్పుడు ఆ లీడర్స్ని దగ్గరికి తీసి ఎక్స్పోజర్ ఇస్తే… రేపు టిక్కెట్ ఇచ్చే టైంకి ఏకుమేకవుతారన్నది వాళ్ళ భయం అని చెప్పుకుంటున్నారు. ఈ వైఖరితో కూటమిలో కుమ్ములాటలు పెరుగుతున్నాయన్నది లోకల్ లీడర్స్ వాయిస్. ఇక వైసీపీలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. నరసాపురం ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముదునూరికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో విభేదాలు ఉన్నాయట. దీంతో ఈసారి సీటు దక్కించుకోవడానికి అవకాశం ఉన్న కాపు నేతలంతా ఎవరి వర్గాన్ని వారు దగ్గర చేసుకుంటూ కట్టడి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ ప్రాధాన్యం కోసం నరసాపురం వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళకు చెక్ పెట్టేందుకు మిగతా లీజర్స్ వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి.

