Minister Nara Lokesh: పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉన్నందున పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచి, శుచిత, నాణ్యత, పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారకరామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదని జరిగిన ఘటనపై విద్యాశాఖ అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో పాఠశాల హెడ్మాస్టర్ జాన్ విద్యార్థులను తప్పుదారి పట్టించి, కుట్రపూరితంగా సోషల్ మీడియా ద్వారా మధ్యాహ్న భోజన పథకంపై దుష్ప్రచారం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని అధికారులు మంత్రికి వివరించారు. ఇటువంటి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి సూచించారు.
Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!
మన పిల్లలకు ఇంట్లో భోజనం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో, అంతకంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు మంత్రి లోకేష్.. భోజనం సిద్ధమైన తర్వాత ప్రతిరోజూ ముందుగా ఒక ఉపాధ్యాయుడు భోజనం నాణ్యతను పరిశీలించి, బాగుందని నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వారంలో ఒక రోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏదైనా ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. దీంతో లోటుపాట్లు గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
పిల్లలు భోజనం గురించి తల్లిదండ్రులకు చెబితే, వారు వెంటనే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు లేదా ఫీడ్బ్యాక్ అందించాలని విజ్ఞప్తి చేశారు లోకేష్.. అపర అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మీద ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని స్పష్టం చేశారు. వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పథకంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్..