NTV Telugu Site icon

Nadendla Manohar: హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?

Nadendla

Nadendla

వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మద్దూరుపాడు జంక్షన్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ పై చేసిన దాడి చూస్తే వైసీపీ అరాచకం ఏ విధంగా పెచ్చరిల్లుతోందో అర్థం అవుతోంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Read Also: David Warner: స్టేడియంలో డేవిడ్ భాయ్ పుష్ప స్టెప్పులు.. వీడియో వైరల్

రోడ్డుకి అడ్డంగా ఉన్న మోటార్ సైకిల్ తీయమని హారన్ మోగించడమే ఆ ఆర్టీసీ డ్రైవర్ చేసిన నేరమా? అని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ బస్సును వెంబడించి మరీ విచక్షణరహితంగా దాడి చేస్తారు.. ఆ అరాచకాన్ని చిత్రించినవారిని బెదిరించారు.. దాడులు చేసిన గూండాలకు బలమైన అండ ఉండటమే ఈ అరాచకానికి కారణంగా కనిపిస్తోంది అని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవరుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు చురుగ్గా స్పందించాలి అని నాదెండ్ల అన్నారు.

Read Also: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..

కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తమ గూండా నాయకులు, కార్యకర్తలకు మద్దతుగా కొత్త చట్టాలు చేస్తుందేమో అనే సందేహం ఉంది.. మిగిలిన ఈ నాలుగు నెలల్లో- హారన్ కొట్టడం, సైకిల్ మీద తిరగడం, రోడ్డు మీద నడవటం కూడా నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేశారు.