మయన్మార్ పార్లమెంట్ ఆన్లైన్ స్కామ్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు మంగళవారం ఒక నూతన చట్టాన్ని ఆమోదించింది. ఈ ‘యాంటీ ఆన్లైన్ స్కామ్ బిల్లు’ ప్రకారం.. సైబర్ స్కామ్ సెంటర్లలో ప్రజలను అక్రమంగా బంధించినా, హింసించినా లేదా బలవంతంగా పనిచేయించినా మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు. రాజధాని నేపిడాలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసినట్లు స్పీకర్ ఆంగ్ లిన్ ద్వే తెలిపారు.
సహాయం పేరుతో లేదా ఉద్యోగాల ఆశ చూపి మనుషులను ట్రాఫికింగ్ చేసి, ఆన్లైన్ మోసాలకు పాల్పడేలా తీవ్రంగా వేధించే వారికి ఈ శిక్షలు వర్తిస్తాయి. బాధితులను కిడ్నాప్ చేసి లేదా అక్రమంగా బంధించి క్రూరంగా ప్రవర్తించడం వల్ల వారు మరణిస్తే, నిందితులకు ఖచ్చితంగా మరణశిక్షే విధించబడుతుంది. అలాగే డిజిటల్ కరెన్సీ (క్రిప్టో) స్కామ్లు నడిపే వారికి, సైబర్ క్రైమ్ కేంద్రాలను నిర్వహించే ముఠా నాయకులకు గరిష్టంగా జీవిత ఖైదు పడేలా ఈ చట్టంలో స్పష్టమైన ప్రొవిజన్లు ఉన్నాయి.
మయన్మార్ సైనిక తిరుగుబాటు తర్వాత ఏర్పడిన అంతర్యుద్ధం, అస్థిరతల వల్ల అక్కడ ఆన్లైన్ మోసాల నెట్వర్క్లు భారీగా విస్తరించాయి. ఉద్యోగాల కోసం వచ్చి మోసపోయిన విదేశీయులను కంబౌండ్లలో బంధించి, డేటింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరిట ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను బురిడీ కొట్టించేలా తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎఫ్ఏటీఎఫ్ (FATF) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ వ్యవహారంపై హెచ్చరికలు జారీ చేశాయి.
2021లో అంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన సైనిక మాజీ అధిపతి మిన్ ఆంగ్ లైంగ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆమోదించిన తొలి చట్టం ఇదే కావడం గమనార్హం. ప్రతిపక్షాలు, సూకీ పార్టీ పాల్గొనకుండా ఇటీవల నిర్వహించిన వివాదాస్పద ఎన్నికల అనంతరం ఈ పార్లమెంట్ కొలువుదీరింది. అంతర్జాతీయంగా వస్తున్న తీవ్ర విమర్శలు, ఒత్తిళ్ల నేపథ్యంలో సైబర్ రంగాన్ని నియంత్రించేందుకు మయన్మార్ ఈ కఠినమైన చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

