పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు. అందుకు మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. అయినా దూకుడుగా వ్యవహరించడంతో పార్టీ నుంచి కబీర్ను మమత సస్పెండ్ చేశారు.
అయినా కూడా తగ్గేదేలే అంటూ హుమాయున్ కబీర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శనివారం
మూడు లక్షల మందితో ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు శంకుస్థాపనకు పూనుకున్నారు. ఇందుకోసం కబీర్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇక ఈ వ్యవహారంపై గవర్నర్ సీవీ.ఆనంద బోస్ స్పందించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, పుకార్లతో మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇదిలా ఉంటే బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు, సభ కోసం పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.