Allagadda: చేతిలో చీపురు పట్టుకుని రోడ్ల మీద ఉన్న చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో గత నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మె కారణంగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించారు. వారు సమ్మెలో ఉండడంతో ఆళ్లగడ్డ పట్టణంలోని రోడ్ల పైన భారీగా చెత్త పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దాన్ని ఊడ్చేందుకు చీపురుపట్టి మున్సిపల్ కమిషనర్ రమేష్బాబు రోడ్డు పైకి వచ్చారు.
Read Also: GVL Narasimha Rao: ప్రధాని రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..
చీపురు పట్టి పురపాలక కమిషనర్ రమేష్ బాబు నడిరోడ్లపై చెత్త ఊడుస్తుండగా.. దీక్షా శిబిరం వద్ద నుంచి పరుగున వచ్చి పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు ఎంతకీ తగ్గకపోవడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచి వెనుదిరిగారు.