‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు మౌళి. ఇక గతేడాది ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో యూత్ను ఆకట్టుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ఇప్పుడు తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ వెనుక హీరో మౌళికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. మౌళి ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం గతేడాది సెప్టెంబర్ 5న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో సెప్టెంబర్ మొదటి వారంలోనే ‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ రాబరీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ అండ్ రాబరీ కామెడీ డ్రామాపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, డిజిటల్ ఆడియన్స్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మౌళి కామెడీ టైమింగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ ధీమాగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్ ఉండటంతో ‘లిటిల్ హార్ట్స్’ సెంటిమెంట్ కలసివచ్చి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

