Kethireddy vs JC: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమన్న ఆయన.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.. అయితే, నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు.. ఇదే సమయంలో.. నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
ఇక, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించిన ఆయన.. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి 52 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో సాగునీరు అడిగే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సీఎం వైఎస్ జగన్ దే తుది నిర్ణయం అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. చివరకు కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా సిద్ధమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.