NTV Telugu Site icon

Champions Trophy 2025: భారత్‌కు పిచ్ అడ్వాంటేజ్‌.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ఏమన్నాడంటే?

Mitchell Starc Ipl 2024

Mitchell Starc Ipl 2024

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని భారత్ గెలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి.. గత ఐసీసీ టోర్నీ పరాభవాలకు బదులు తీర్చుకుంది. అయితే దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతోనే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అన్నారు. పిచ్ అడ్వాంటేజ్‌ భారత జట్టుకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనలను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొట్టిపడేశాడు. పిచ్ అడ్వాంటేజ్‌ అనేది అర్థరహితమని, భారత్ బాగా ఆడిందన్నాడు.

ఫ్యానటిక్స్ టీవీతో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ… ‘పిచ్ అడ్వాంటేజ్‌ అవుతుందని కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం అన్ని దేశాల క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫ్రాంచైజీ మ్యాచుల్లో ఆడుతున్నారు. టీమిండియా ప్లేయర్లు మాత్రం కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఏడాదిలో 5-6 ఫ్రాంచైజ్ లీగ్‌లలో ఆడే ప్లేయర్స్ ఉన్నారు. వారితో పోలిస్తే భారత్ ప్లేయర్లకు విదేశీ పిచ్‌లపై అవగాహన తక్కువే ఉంటుందని భావిస్తున్నా. భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో నాకు ఆశ్చర్యం కలగలేదు. నిజం చెప్పాలంటే భారత్ ఆడిన మ్యాచులను చూడలేదు. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచులే అప్పుడప్పుడు చూశా. గతేడాది నేను వరుణ్‌ చక్రవర్తితో కలిసి ఆడా. అతను చాలా ప్రతిభావంతుడు. అత్యుత్తమ వైట్-బాల్ జట్టు భారత్ అంటే?.. టీమిండియా అభిమానులు అవును అని చెబుతారు, ఆస్ట్రేలియన్ అభిమానులు కాదు అని చెబుతారు’ అని అన్నాడు.