Thummala Nageswara Rao: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా డిమాండ్ పెరుగుతున్నదని, అయినా సరఫరాలో తీవ్ర లోటు ఉందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 3.06 లక్షల టన్నులే సరఫరా అయ్యాయని తెలిపారు. దీంతో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, ఇది రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
Read Also:Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
జూలై నెలకుగాను కేంద్రం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, అందులో 60 శాతం ఇంపోర్టెడ్ యూరియానే ఉండడం రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే, ఇప్పటివరకు ఆ యూరియాను రవాణా చేసేందుకు అవసరమైన నౌకలను కేంద్రం కేటాయించలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పంటలకు అత్యంత కీలకమైన సమయంలో యూరియా అందకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని తుమ్మల హెచ్చరించారు. కేంద్రం తక్షణమే స్పందించి యూరియా సరఫరాను సవ్యంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also:ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
ముఖ్యంగా తుమ్మల లేఖలో పేర్కొన్న కీలక సూచనలు గమనించినట్లయితే.. జూలై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియాకు నౌకలను వెంటనే కేటాయించాలని కోరారు. RFCL నుండి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరా 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలన్నారు. ఏప్రిల్–జూన్ మధ్య తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు. ఈ లేఖ కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్లకు పంపినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
