NTV Telugu Site icon

Gudivada Amarnath: లారీ ఎక్కి ఊగిపోతే ఎలా తెలుస్తుంది..? పవన్‌పై మంత్రి అమర్నాథ్‌ సెటైర్లు

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్‌ వ్యవస్థపై చేసిన కామెంట్లు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతూనే ఉన్నాయి.. ఓవైపు పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతుండగా.. మరోవైపు.. విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. మరోసారి పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్యాకేజీ స్టార్.. పవన్‌ కట్యాణ్‌ నువ్వు చెప్పిన వాలంటీర్లు గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా ప్రజ‌లకు పింఛ‌న్ అందిస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన ప్రభుత్వ స‌ర్టిఫికెట్లు అందిస్తున్నారు. క‌రోనా సమ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వహించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్రజ‌ల‌కు ఎప్పటిక‌ప్పుడు సమాచారం అందించారు. అప్పుడు నువ్వు, నీ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముసుగుత‌న్ని ప‌డుకున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: Vijaya Shanthi: కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ మధ్యలోనే వెళ్లిపోయిన రాములమ్మ.. అసలు కారణం ఆయనే..!

ఆ రోజు తెలియ‌ లేదా వాలంటీర్లకు బాస్ ఎవ‌రో? అంటూ పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు మంత్రి అమర్నాథ్.. ఎవరు చెప్తే వారు ప్రజ‌ల‌కు మంచి చేస్తున్నారో? వారు ఏ మంత్రిత్వ శాఖ కింద‌కు వస్తారు అని? ఇప్పుడు వారిపై నింద‌లు వేయ‌డానికి త‌యార‌య్యావు. వాలంటీర్లు చేసే మంచి ఏంటో వారి వ‌ల్ల ల‌బ్ధిపొందుతున్న ప్రజ‌ల‌ను నేరుగా అడుగు తెలుస్తుందని అని సూచించారు. అంతే త‌ప్ప లారీ (వారాహి వాహనం) ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుంది? అంటూ #PackageStarPK తో ట్వీట్‌ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం జరుగుతుందని.. అసలు డబ్బులు తీసుకునేవారిని వాలంటీర్లు అని ఎలా అంటారు..? వారిలో కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు.. ప్రజల డేటా మొత్తం సేకరించడానికి వీరికి హక్కు ఎక్కడి అంటూ పవన్‌ కల్యాణ్ ప్రశ్నించిన విషయం విదితమే.. పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నిస్తూ చేసిన ఓ ట్వీట్‌కు బదులిస్తూ.. ఇలా ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.