NTV Telugu Site icon

Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ

Minister Gottipaati Ravi Ku

Minister Gottipaati Ravi Ku

Minister Gottipaati Ravi Kumar: వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు. ఈ సందర్భంగా SAEL SOLAR కంపెనీ ప్రతినిధులు.. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో.. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్‌లను SAEL SOLAR కంపెనీ నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వారితో పాటు నార్వే, రష్యా, బ్రెజిల్, చైనా (బ్రిక్స్) దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని కలిసి పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు తమ ఆసక్తిని వ్యక్తీకరించారు. సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే విధంగా చెత్త నుంచి విద్యుత్ (వేస్ట్ ఎనర్జీ) ఉత్పత్తి చేయడంతో పాటు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తమకు వున్న అనుభవాన్ని, పెట్టుబడులు పెట్టడానికి తమ సుముఖతను పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు.

Read Also: Andhra Pradesh: రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక

పెట్టుబడులకు కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్ – మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుపుతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల భేటీలో పలు విషయాలను ఆయన వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ వుంటుందని, అనుమతుల మంజూరు లో, ఇతర అన్ని అంశాలలో పారదర్శకత వుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యలతో ఐదేళ్లలో పారిశ్రామిక, విద్యుత్ రంగాలకు జరిగిన అపార నష్టాన్ని తెలియజేయడంతో పాటు… నష్ట నివారణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ మంత్రి గొట్టిపాటి వివరించారు. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు ముందుకు వచ్చే దేశ, విదేశీ కంపెనీలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే విధంగా 600 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దేశీ కంపెనీ SAEL SOLAR ప్రతినిధులను మంత్రి అభినందించారు.