టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఆరోపించారు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేదా వాళ్ల ఆఫీసు పగల గొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో స్పష్టత కరువైందన్నారు. అసలు ఢిల్లీ పర్యటనలో ఆయన్ను పలకరించేవారే లేరని ఎద్దేవా చేశారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఢిల్లీ వెళ్తున్నారని మంత్రి బాలినేని ప్రశ్నించారు.
Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్
టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అని చెప్పుకునే చంద్రబాబు… ఆ పార్టీని ప్రారంభించిన దేవుడు ఎన్టీఆర్ను చెప్పులతో ఎందుకు కొట్టించారని మంత్రి బాలినేని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర గురించి చెపుతుంటే వినేందుకు తమకు అసహ్యం కలుగుతోందన్నారు. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని బాలినేని మండిపడ్డారు. తన హయంలో సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించని ఆయన.. ఇప్పుడు టీడీపీ కార్యాలయాలపై దాడి అంశంపై సీబీఐ విచారణ జరపాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.