Massive Explosion in Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని విషాదం చోటుచేసుకుంది.. కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సమీపంలోని ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా జిలెటిన్ స్టిక్స్ పేలాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: Varun Tej: ‘బరి’ షూటింగ్లో వరుణ్ తేజ్కు అనుకోని ప్రమాదం!
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనో 25 మందికి పైగా తీవ్రగాయాలపాలు కాగా.. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మబున్నీ, మధు, సంపత్, వెంకన్నగా గుర్తించారు అధికారులు.. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఘటన తీరును.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు..
