హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్పురా వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఇచ్చిన జ్యూస్ కారణంగా.. చాలా మంది వ్యక్తులు 15 గంటల పాటు నిద్రపోయారు. అయోమయంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ కంత్రీ యువకుడు ఎవరు? ఆ జ్యూస్లో అతడు ఏం కలిపాడు? ప్రస్తుతం పరారీలో ఉన్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read:QNET Investment Scam: మరో యువకుడిని బలి తీసుకున్న QNET.. ఏంటి స్కామ్..?
ఇక్కడ చూడండి..తెల్లటి దుస్తుల్లో ఉన్న ఈ యువకుడు పాతబస్తీలోని డబీర్పురాలో పలు దుకాణాలు, అపార్ట్మెంట్లు తిరిగాడు. తాను ఖురాన్ చదవడం పూర్తి చేసుకున్న సందర్భంగా జ్యూస్ తాగిస్తున్నానని అందరికీ జ్యూస్ తాగించాడు. కొంత మంది అతను ఇచ్చిన జ్యూస్ తాగారు.. కొంత మంది నిరాకరించారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. జ్యూస్ తాగిన వారిలో గడచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 12 మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయారు. వీరంతా 12 నుంచి 15 గంటల తరువాతే మళ్లీ నిద్రలేచారు. పూర్తిగా అయోమయ స్థితిలోకి చేరినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం విశేషం.
కొందరైతే ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకూ తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే డబీర్పురా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. పోలీసులు బాధితుల స్టేట్మెంట్ తీసుకోవడమేకాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇంతకీ యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు? అతని ఉద్దేశం ఏమిటి? ఇచ్చిన జ్యూస్లో ఏవైనా మత్తు పదార్థాలు కలిపాడా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. డబ్బా నుంచి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్ట్మెంట్, దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది.
Also Read:Kalvakuntla Kavitha: తెలంగాణ యాత్రకు కల్వకుంట్ల కవిత శ్రీకారం.. ఎప్పటి నుంచంటే..?
ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు చెప్పలేం అంటున్నారు. జ్యూస్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేక తీవ్రమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది నివేదికలు రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అపరిచితులిచ్చే పదార్థాలు తీసుకోవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
