Manda Krishna Madiga: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్దారులను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్దారులకు నెలకు రూ. వెయ్యి కోట్ల చొప్పున అందాల్సి ఉంటే.. ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా నెరవేర్చడం లేదన్నారు.
READ MORE: మహబూబాబాద్ : రైతులందరికీ సరిపడా యూరియా అందిచాలని డిమాండ్!
తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదన్నారు. తెలంగాణలో చేయూత ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తామని.. ఆ తర్వాత విస్మరించిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డికి లేదన్నారు. నవంబర్ మొదటివారంలో పెన్షన్ తో పాటు పది నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే దివ్యాంగుల సమాజ చేయుత దారులందర్నీ మరో ఉద్యమానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఎమ్మార్పీఎస్ బాధ్యత తీసుకుంటుందని హెచ్చరించారు. నవంబర్ 26న పెన్షన్ దారుల పోరాట దినంగా ప్రకటించి.. దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారులతో చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
READ MORE: KTR: రెండోసారి కూలిన కాఫర్ డ్యామ్.. పోలవరాన్ని కూలవరం అనే దమ్ము వాళ్లకు ఉందా?
