Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!

Viral News

Viral News

Hero Splendor Plus Bike: “చిన్న చిన్న పొదుపులే పెద్ద సంపదకు పునాది” అనే సామెతను నిజం చేశాడు యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడుకు చెందిన కొండె రఘుపతి. తన వినూత్న నిర్ణయంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన మోటార్‌సైకిల్‌ను పూర్తిగా రూ.10 నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొండె రఘుపతి స్థానికంగా ఉన్న శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కొనుగోలు చేశారు. అయితే బైక్ ధర అయిన రూ.1.10 లక్షలను నగదు నోట్లలో కాకుండా పూర్తిగా రూ.10 నాణేల రూపంలో చెల్లించి ఔరా అనిపించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రఘుపతి పలు ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొచ్చిన రూ.10 నాణేలను షోరూమ్‌లో ఖాళీ చేస్తుండటం కనిపిస్తుంది. ఆ తర్వాత షోరూమ్ సిబ్బంది ఒక్కో నాణ్యాన్ని ఓపికగా లెక్కించి మొత్తం రూ.1.10 లక్షలు పూర్తి చేశారు. చెల్లింపు పూర్తయిన తర్వాత రఘుపతికి కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను అందజేశారు షోరూమ్ యజమాని. ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యం ఓ పెద్ద తాళంచెవి (కార్డ్‌ బోర్డ్ కీ)ను అందిస్తూ అభినందించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. చిన్న మొత్తాలను క్రమంగా పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించవచ్చని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, అంత పెద్ద మొత్తాన్ని నాణేల రూపంలో స్వీకరించి ఓపికగా లెక్కించిన షోరూమ్ సిబ్బందిని కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సంఘటనే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో కూడా చోటుచేసుకుంది. 2025 అక్టోబర్‌లో జష్‌పూర్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆరు నెలల పాటు దాచుకున్న రూ.40 వేల విలువైన నాణేలతో తన కుమార్తెకు స్కూటీ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు తెలంగాణకు చెందిన రఘుపతి కూడా అదే తరహాలో పొదుపు శక్తిని చాటుతూ వార్తల్లో నిలిచారు.