సహజీవనం చేస్తున్న జంటలకు తీపికబురు చెబుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. జనాభా లెక్కల్లో సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కలిసి జీవిస్తున్న జంటలను కుటుంబంగా గుర్తించబోతున్నట్లు తెలిపింది.
జనగణన మొదటి దశకు సంబంధించి ప్రభుత్వం 33 ప్రశ్నలను (FAQs) విడుదల చేసింది. తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావించి సహజీవనం చేస్తున్న జంటలను వివాహితులుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది.
రెండు దశల్లో జనగణన నిర్వహించనున్నారు. తొలిదశలో గృహ గణన చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే జనగణన మొదటి దశలో గృహ పరిస్థితులు ఉంటాయి. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఇంటి యజమాని, అతని వ్యక్తిగత వివరాలు, కులం, కమ్యూనిటీకి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాల గురించి అడుగుతారు.
