హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్పై విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో భారతి అనే యువతి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజూష్ కారు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ సమీపంలో సంజూష్ నడుపుతున్న కారు భారతి అనే మహిళను ఢీకొట్టడంతో.. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంజూష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారు వేగం, డ్రైవింగ్ తీరుతో పాటు ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా సంజూష్ను మరోసారి విచారించేందుకు పోలీసులు నేడు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. విచారణలో ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరించే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వాహనం పరిస్థితి, డ్రైవింగ్కు సంబంధించిన అంశాలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు, దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని సంజూష్ తాజాగా తెలిపారు. ప్రమాదం తర్వాత తాను అక్కడి నుంచి పారిపోలేదని, పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానని సంజూష్ చెప్పుకొచ్చారు.

