Leopard: తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిగోపురాన్ని దాటిన అనంతరం నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. చిరుతను చూసిన భక్తులు పెద్దగా అరవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల అరుపులు, రద్దీ కారణంగా చిరుత సమీప అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఘటనపై అటవీశాఖ, సంబంధిత అధికారులు అప్రమత్తమై నడకమార్గంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు సమాచారం. కాగా, రెండేళ్ల క్రితం వరుసగా చిరుతలు తిరుమల మెట్ల మార్గంలో భక్తులను భయాందోళనకు గురి చేశాయి.. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు.. ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేసి.. కొన్ని చిరతలను బంధించిన విషయం విదితమే.. ఇక, భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ.. భక్తులు గుంపులుగా వెళ్లాలని.. నడకదారిలో వెళ్లే భక్తులు కర్రలతో వెళ్లాలని కూడా అప్పట్లో సూచించిన విషయం విదితమే..

