Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!

Lalit Kumar Modi

Lalit Kumar Modi

Lalit Kumar Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2009 నిర్వహణకు సంబంధించిన విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ట్రిబ్యునల్ ఆయనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను పూర్తిగా రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత లలిత్ మోదీ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

2009లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ రెండో సీజన్‌ను భారత్‌లో నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో టోర్నీని దక్షిణాఫ్రికాకు మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియలో విదేశీ నిధుల బదిలీలకు సంబంధించి FEMA నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది.

జూలై 16న ట్రిబ్యునల్ ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో విజయవంతంగా నిర్వహించడంలో లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారని ట్రిబ్యునల్ పేర్కొంది. ఆయనపై విధించిన జరిమానా సరైన ఆధారాలు లేకుండా విధించబడిందని, కేసులో ఆయనను అనవసరంగా ఇరికించారని స్పష్టం చేసింది. దీంతో లలిత్ మోదీపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను పూర్తిగా రద్దు చేసింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే లలిత్ మోదీ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు.. విజయోత్సాహంతో డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా లలిత్ మోదీ మాట్లాడుతూ.. తనపై ఈడీ నమోదు చేసిన కేసుకు అసలు ఆధారమే లేదని ట్రిబ్యునల్ తేల్చిందన్నారు. ఐపీఎల్ 2009ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు జరిగిన లావాదేవీలు క్యాపిటల్ అకౌంట్ కింద కాకుండా కరెంట్ అకౌంట్ ఫారిన్ రిమిటెన్స్ కింద జరిగాయని ట్రిబ్యునల్ గుర్తించిందని తెలిపారు. అలాగే BCCI తరఫున FEMA నిబంధనల అమలుకు తాను బాధ్యుడిని కాదని, తనకు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. గత 16 సంవత్సరాలుగా తాను ఎలాంటి వ్యక్తిగత తప్పు చేయలేదని చెబుతూ వచ్చానని, ఇప్పుడు అదే నిజమని నిరూపితమైందని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల కారణంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యమైందని, అందుకే దక్షిణాఫ్రికాలో నిర్వహించే నిర్ణయం తీసుకున్నామని లలిత్ మోదీ తెలిపారు. ఆ నిర్ణయం వల్లే ఐపీఎల్ నిలదొక్కుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఎదిగిందని అన్నారు. ఈ కేసులో అప్పటి BCCI కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ పై విధించిన రూ.1 కోటి జరిమానాను రూ.10 లక్షలకు ట్రిబ్యునల్ తగ్గించింది. అప్పటి BCCI ఖజానాదారు ఎం.పీ. పాండోవ్ పై విధించిన రూ.50 లక్షల జరిమానాను రూ.5 లక్షలకు తగ్గించింది. అలాగే BCCIపై విధించిన రూ.4 కోట్ల జరిమానాను ఒక కోటికి తగ్గించింది. అయితే మరో FEMA అంశానికి సంబంధించిన కేసులో ఎన్. శ్రీనివాసన్, ఎం.పీ. పాండోవ్‌లపై విధించిన రూ.50 లక్షల జరిమానాను మాత్రం ట్రిబ్యునల్ యథాతథంగా కొనసాగించింది. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించినందున ఆ జరిమానా సమంజసమేనని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.