AP Student Suicide in US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి.. ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరు అయితే.. మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు.. తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాళ్లు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అమెరికాలో చదువుల కోసం వెళ్లిన కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర షాక్కు గురిచేసిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
కర్నూలు జిల్లాకు చెందిన చందు అనే యువకుడు అమెరికాలోని చికాగో నగరంలో ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, అవకాశాలు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన చందు పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి.
ఇక మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు Telugu Association of North America (తానా) చర్యలు చేపట్టింది. అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉద్యోగ అవకాశాల కొరత వంటి సమస్యలను మరోసారి గుర్తు చేస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు చందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
