ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానం వీడియోను సోషల్ మీడియాలో తప్పుగా చూపించడంపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో జనసైనికులు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై BNS సెక్షన్లు 353(2), 356(2) కింద క్రైమ్ నంబర్లు 11, 12, 13, 14లలో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్పై తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్లలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్పై కేసు నమోదయింది. చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్న వారిపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.
ప్రయాగ్ రాజ్లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లారు. తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకిరా నందన్తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పవన్ పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్లారు.