Krunal Pandya Emotional: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్పై చివరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా హీరోగా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం క్రునాల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది.
మాజీ జట్టు ముంబై ఇండియన్స్పై ఆడటం తనకు ఎప్పుడూ సులభం కాదని కృనాల్ తెలిపాడు. ముంబై జట్టుతో తన కెరీర్లో ఎన్నో మధుర క్షణాలు గడిపానని, ఆ ఫ్రాంచైజీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తరువాత జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా అతడి కళ్లలో నీళ్లు కనిపించాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆటగాడు కీరోన్ పోలార్డ్ గురించి మాట్లాడుతూ.. మరింత ఎమోషనల్ అయ్యాడు. పోలార్డ్ను టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా అభివర్ణించిన కృనాల్.. పాండ్య బ్రదర్స్ ప్రయాణంలో పోలార్డ్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో తనకు విపరీతమైన క్రాంప్స్ వచ్చాయని కూడా క్రునాల్ వెల్లడించాడు. మొదట కాల్వ్ లో మొదలైన నొప్పి తర్వాత గ్లూట్స్, వెన్ను వరకు వెళ్లిందని తెలిపాడు. సాధారణంగా తాను ఇంతసేపు బ్యాటింగ్ చేయనని, కానీ జట్టు కోసం చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అలాగే చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ కొట్టిన కీలక సిక్స్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయిందని కొనియాడాడు. రాయ్పూర్ పిచ్ బ్యాటింగ్కు అంత సులభంగా లేదని, ఓపికగా సరైన షాట్లు ఆడాల్సి వచ్చిందని వివరించాడు.
ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి RCB విజయానికి ప్రధాన కారణమయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 167 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగగా.. చివరి బంతికి RCB విజయం సాధించింది.
