కోల్కతాలోని నీల్రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలోని టాయిలెట్లో 30 ఏళ్ల నర్సు రూపాలి బర్మన్ మృతదేహాన్ని గుర్తించారు. టాయిలెట్ తలుపు చాలా సేపు మూసి ఉండటంతో.. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రూపాలి బర్మన్ బుధవారం రాత్రి విధుల్లో ఉన్నారు. రాత్రి 8 గంటలకు ఆమె డ్యూటీ ప్రారంభమైంది. గైనకాలజీ విభాగంలోని హై డిపెండెన్సీ యూనిట్ నర్సింగ్ స్టేషన్లో విధులకు హాజరైన ఆమె.. ఓ రోగికి సేవలు అందించారు. ఆ తర్వాత హెడ్డీయూలోని టాయిలెట్కు వెళ్లారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రాత్రి 10.20 గంటలకు ఆమె టాయిలెట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతసేపటి తర్వాత కూడా ఆమె బయటకు రాకపోవడంతో సహచరులు 10.27 గంటల సమయంలో ఆమెను పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. దీంతో చివరకు టాయిలెట్ తలుపును బలవంతంగా తెరిచారు. లోపల రూపాలి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సహచరులు గుర్తించారు. వెంటనే ఆమెను ట్రాలీపై ఉంచి వైద్య సహాయం కోసం తీసుకెళ్లారు. అయితే వైద్యులు చికిత్స అందించేలోపే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
టాయిలెట్ బయట సీసీటీవీ కెమెరా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూపాలి టాయిలెట్లోకి వెళ్లినప్పటి నుంచి జరిగిన పరిణామాలు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైనట్లు సమాచారం. పోలీసులు ఆ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కోల్కతా పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైమ్) కునాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 10.30 గంటలకు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. రూపాలి ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో నర్సుగా పనిచేస్తున్నారని చెప్పారు. ‘‘మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కోల్కతా పోలీస్ డీడీ హోమిసైడ్ విభాగం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఇప్పటివరకు ఇది ఆత్మహత్య అని నిర్ధారణ కాలేదు. ఫోరెన్సిక్ బృందం త్వరలో అక్కడికి చేరుకుంటుంది. సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
ఆరోగ్య శాఖ కూడా దర్యాప్తు
ఈ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తుతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా విచారణ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రూపాలి బర్మన్ మృతికి అసలు కారణమేంటి? ఆమెకు ఏమైనా ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గతంలో మమతా బెనర్జీ హయాంలో ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మమత ప్రభుత్వం ఓడిపోయింది.

