Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!

Kolkata

Kolkata

Kolkata: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతాలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు తృణమూల్ కాంగ్రెస్ (TMC) యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జనతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహువా మోయిత్రా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ను ఎద్దేవా చేశారు. “కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారని, ఇదే బీజేపీ అసలు రూపమంటూ మండిపడ్డారు.

మరోవైపు, ఈ అంశంపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజమని, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని, ఘర్షణలు జరుగుతున్నప్పుడు అడ్డుకోవద్దని కేంద్ర బలగాలకు ఆదేశాలు ఇచ్చారని టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. బెంగాల్‌లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినదని వాదిస్తున్నారు. గతంలో ఓ దుకాణదారుడి నుంచి బలవంతంగా లాక్కున్న స్థలంలో ఈ యూనియన్ ఆఫీసును నిర్మించారని చెబుతున్నారు. అలాగే, కూల్చింది మాంసం దుకాణం కాదని, అది అనధికారికంగా నిర్మించిన పార్టీ కార్యాలయమని స్థానికులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.