ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతున్న 65వ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు కోల్కతా బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసి తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) నాటౌట్గా ఉన్నారు.
టాప్ ఆర్డర్ను నలిపేసిన గ్రీన్, సౌరభ్ దూబే..
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. కేకేఆర్ బౌలర్ కేమరూన్ గ్రీన్ మూడో ఓవర్లోనే ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6)ను మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపగా.. ఆ వెంటనే నమన్ ధీర్ను కూడా గ్రీన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాది మంచి ఊపు మీద కనిపించినప్పటికీ.. 15 పరుగుల వద్ద సౌరభ్ దూబే బౌలింగ్లో కేమరూన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే ప్రమాదకరమైన సూర్యకుమార్ యాదవ్ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసి సౌరభ్ దూబే బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ముంబై పవర్ప్లే ముగిసేసరికే పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత భారీ వర్షం పడటంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పేశారు.
ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ ఇలా పేకమేడలా కూలిపోవడంతో సోషల్ మీడియాలో మళ్లీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నప్పుడల్లా ముంబై జట్టు ఇలాగే దారుణంగా విఫలమవుతోందని కొందరు నెటిజన్లు ఫన్నీ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు.
అయితే, దీనిపై పాండ్యా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యాకు అస్సలు సపోర్ట్ చేయడం లేదని, అందుకే మ్యాచ్ల్లో కనీస బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కెప్టెన్గా జట్టును గెలిపించాలనే కసితో గాయం నుంచి కోలుకుని హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చినా.. టీమ్లోని మిగిలిన ప్లేయర్స్ పూర్ పర్ఫార్మెన్స్తో అతడిని ఒంటరిని చేస్తున్నారనే వాదనలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి. వర్షం తగ్గాక హార్దిక్, తిలక్ వర్మలు కలిసి ముంబైని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.
