Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్ర, నిజాం పాలన, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు ఈరోజు నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని బండి సంజయ్ కుమార్ అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకే రోజు రావడం ప్రత్యేకమని పేర్కొన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్య్రం పొందితే తెలంగాణకు కాస్త ఆలస్యంగా విమోచనం లభించిందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైందని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రాణత్యాగాలు చేశారని, ఆ పోరాట చరిత్ర తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు.

నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. అలాంటి పాలకుడిని గొప్పవాడిగా చిత్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిజాంను పొగిడే నాయకులు వీర బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలను గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని విస్మరించి అవినీతి ఆరోపణలు, పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అవినీతికి తావులేకుండా పాలన కొనసాగుతోందని అన్నారు. అవినీతిమయ ప్రభుత్వం కావాలా.? అవినీతి రహిత పాలన కావాలా.? అని ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా.? లేక ఆ చరిత్రను భావితరాలకు తెలియజేసే పాలన కావాలా.? అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన కోసం ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

మరోవైపు ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలుగును అణచివేసి ఉర్దూను రుద్దారని ఆరోపించారు. ఓట్ల కోసం నిజాంను గొప్పవాడిగా చిత్రీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజాం మంచి పాలకుడైతే ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించారని రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో బురుజులు ఎందుకు ఉన్నాయని, నిజాం పాలనకు వ్యతిరేకంగా భారత సైన్యం ఎందుకు చర్య చేపట్టాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాలని అన్నారు.

నిజాం పాలనకు సంబంధించిన చరిత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. నిజాం పాలన ముగిసినా ఆయన వారసత్వంగా మజ్లిస్ రాజకీయాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. 2029 నాటికి తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేలా చూస్తామని కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకునే ధైర్యం మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వారి చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను పాట, సంగీతం, దృశ్య రూపంలో ప్రజలకు అందించిన ఆకుల నాగేశ్వర్, వందేమాతరం శ్రీనివాస్, దీపికలను ఆయన అభినందించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో చారిత్రక అంశాలపై ప్రత్యేక ప్రదర్శన, ‘హైదరాబాద్ విమోచనం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమం, వందేమాతరం సామూహిక గానం, కేంద్ర సాయుధ పోలీసు బలగాల కవాతు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.