Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!

Kiren Rijiju

Kiren Rijiju

Kiren Rijiju: చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి భారత్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలనే భారత్ ఆశిస్తోందని, అంతమాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘బ్రిక్స్ డైలాగ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజిజు గుర్తుచేశారు. అయితే, సరిహద్దుల వద్ద దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారత్ ఎప్పుడూ వెనకడుగు వేయదని(తగ్గేదేలే) స్పష్టం చేశారు. స్వతహాగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నేత కావడంతో చైనా వ్యవహారంపై తనకు అత్యంత స్పష్టమైన, బలమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రజలు గతంలోనూ చైనా దూకుడును ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర మంత్రిగా తన వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే, అవి భారత ప్రభుత్వ అధికారిక విధానంగా పొరబడే అవకాశం ఉన్నందున తాను మరింత సుదీర్ఘంగా మాట్లాడటం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఏకపక్షంగా మారుస్తుండటంపై రిజిజు ఘాటుగా స్పందించారు. ఇవన్నీ చైనా ఆడుతున్న “మైండ్ గేమ్‌లు, ఎత్తుగడలు” మాత్రమేనని కొట్టిపారేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా చరిత్రతో గానీ, వారి సంస్కృతి-నాగరికతలతో గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చైనా కొంత ముందుండవచ్చని అంగీకరించిన మంత్రి, ప్రస్తుతం భారత్ కూడా అదే స్థాయిలో సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, నెట్‌వర్క్ వంటి సౌకర్యాలను వేగంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అతి త్వరలోనే చైనా సాంకేతిక, మౌలిక సామర్థ్యాలను భారత్ పూర్తిగా అందుకోవడమే కాకుండా, మన భూభాగాన్ని రక్షించుకోవడంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని రిజిజు స్పష్టం చేశారు. నేడు జరగబోయే మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి..