Ketan Agarwal Murder Case: పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ ఎంత తీవ్రంగా సాగుతోందో, బాధితుడు, నిందితురాలి తల్లుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఒకవైపు గోయల్ కుటుంబం తమకు ఎన్నో కీలక విషయాలు దాచిపెట్టి మోసం చేసిందని కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ఆరోపిస్తుండగా, అసలు ఆ ట్రెకింగ్కు వెళ్లడం తన కూతురికి ఇష్టమే లేదని, కేతనే బలవంతంగా తీసుకెళ్లాడని నిందితురాలు సియా గోయల్ తల్లి పూజా గోయల్ వాదిస్తున్నారు. తన ఇంటికి కోడలిగా రాబోయే అమ్మాయే తన కొడుకు ప్రాణాలు తీసే కుట్రలో భాగమవుతుందని కలలో కూడా ఊహించలేదని రాఖీ అగర్వాల్ కన్నీరుమున్నీరవుతున్నారు. సియా పలుమార్లు తమ ఇంటికి వచ్చిందని, హోలీ పండుగను తమతోనే జరుపుకుందని, పూజా కార్యక్రమాల్లో పాల్గొని అందరితో ఎంతో ఆప్యాయంగా కలిసిపోయిందని ఆమె గుర్తుచేసుకున్నారు. పెళ్లి పట్ల సియాకు ఇష్టం లేదన్న విషయం ఏ కోశానా తమకు అనిపించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ సియాకు గానీ, ఆమె కుటుంబానికి గానీ ఈ పెళ్లి ఇష్టం లేకపోయి ఉంటే ఆ విషయం ముందుగానే చెప్పి ఉంటే బాగుండేదని, కనీసం ఏదైనా సూచన ఇచ్చినా ఈ సంబంధాన్ని రద్దు చేసుకునేవాళ్లమని, అప్పుడైనా తన కొడుకు ప్రాణాలతో దక్కేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకునేవాడని, నవంబర్లో జరగాల్సిన వివాహం కోసం అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశామని చెప్పారు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని, గోయల్ కుటుంబం ఎన్నో విషయాలు దాచి తమ నమ్మకాన్ని వమ్ము చేసిందని రాఖీ ఆరోపించారు.
వీటితో పాటు సియా ప్రవర్తనపై రాఖీ అగర్వాల్ మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. సియా పార్టీలలో మద్యం సేవించేదని, తమ ఇంట్లో ఇలాంటివి నడవవని, పార్టీలకు వెళ్లినా మద్యం ముట్టకూడదని తాను సియాను ముందే హెచ్చరించినట్లు రాఖీ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను సియా తల్లి పూజా గోయల్ తీవ్రంగా ఖండించారు. తన కూతురు ఎప్పుడూ మద్యం తాగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ సియా నిజంగానే మద్యం తాగే అలవాటు ఉన్నదైతే, ఆ విషయం కేతన్ కుటుంబ సభ్యులు ముందే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడు ఈ దారుణం జరిగిన తర్వాత మాత్రమే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ పెళ్లి చేసుకోవడం తన కూతురికి ఇష్టం లేదన్న వాదనను సైతం పూజా గోయల్ కొట్టిపారేశారు. సంబంధం ఖాయం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా పెళ్లి ఇష్టమేనా అని తాము సియాను ఎన్నోసార్లు అడిగామని, ప్రతిసారీ ఆమె సంతోషంగా అంగీకరించిందని చెప్పారు. సియాకు వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం కూడా తమకు అస్సలు తెలియదన్నారు.
అంతేకాకుండా పూజా గోయల్ కొన్ని ఎదురు ప్రశ్నలు సైతం సంధించారు. ఒకవేళ సియా ప్రవర్తనలో మార్పు వచ్చిందని కేతన్ నిజంగానే ఆందోళన చెంది ఉంటే, ఆ విషయాన్ని రెండు కుటుంబాలు కూర్చుని బహిరంగంగా ఎందుకు మాట్లాడుకోలేదని నిలదీశారు. గత నాలుగు నెలలుగా రెండు కుటుంబాలు తరచుగా కలుసుకున్నాయని, వీడియో కాల్స్ మాట్లాడుకున్నాయని, ఫంక్షన్లకు కలిసి వెళ్లామని, అయితే ఎక్కడా ఈ సంబంధంలో విభేదాలు ఉన్నట్లు అనిపించలేదని ఆమె అన్నారు. ఇక లోహాఘడ్ కోట ట్రెకింగ్ విషయానికొస్తే, అక్కడికి వెళ్లడం సియాకు ఏమాత్రం ఇష్టం లేదని, కేతన్ పట్టుబట్టడం వల్లే ఆమె వెళ్లిందని పూజా వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ సైతం సియా మొబైల్లో ఉందని, ట్రెకింగ్కు వెళ్లడం ఇష్టం లేదన్న విషయాన్ని సియా తన కాబోయే అత్తగారితో ముందే చెప్పిందని పూజా గోయల్ పేర్కొన్నారు.
ఇలా రెండు కుటుంబాల మధ్య పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నప్పటికీ, ఇద్దరు తల్లుల వాదనలో ఓ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కనిపిస్తోంది. తన కొడుకుకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని రాఖీ అగర్వాల్ డిమాండ్ చేస్తుండగా.. సియా తల్లి పూజా గోయల్ కూడా అదే స్పందన వ్యక్తం చేశారు. ఒకవేళ పోలీసుల విచారణలో తన కూతురే తప్పు చేసిందని కోర్టులో రుజువైతే, చట్టప్రకారం ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం ముందు ఏ బంధమూ గొప్పది కాదని, తప్పు చేస్తే తన కూతురిని సైతం అదే లోయలో నుంచి కిందకు తోసేయాలని పూజా గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఈ కేసులో వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ తదితర డిజిటల్, సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరికి ఏ విషయాలు తెలుసు అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

