Kerala Live-in Couple: సహజీవనం చేస్తున్న జంట దారుణం.. నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టి.. చివరకు

  • సహజీవనం చేస్తున్న జంట దారుణం
  • నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టి
  • అవశేషాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయారు
Kerala

Kerala

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Ukraine War: 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా…

పోలీసుల విచారణలో, ఫేస్‌బుక్‌లో పరిచయం తర్వాత 2020 నుంచి తాము లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఆ జంట చెప్పారు. భవిన్ ప్లంబర్‌గా పనిచేస్తుండగా, అనిషా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేవారని తెలిసింది. సహజీవనం చేస్తున్న జంట చెప్పిన వివరాల ప్రకారం.. అనిషా 2021లో తన ఇంటి బాత్రూంలో ఒంటరిగా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డు తాడు శిశువు మెడలో చుట్టుకుపోవడం వల్ల ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయిందని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా బిడ్డను ఇంటి ఆవరణలో పాతిపెట్టిందని పేర్కొంది. ఎనిమిది నెలల తర్వాత, భవిన్ కోరిక మేరకు, ఆమె బిడ్డ అవశేషాలను అతనికి అప్పగించింది. భవిన్ ఈ ఎముకలను తమ సంబంధానికి చిహ్నంగా ఉంచుకున్నాడని, బిడ్డను దహనం చేయాలని ప్లాన్ చేస్తున్నామని స్నేహితులకు చెప్పాడని తెలుస్తోంది.

Also Read:Indian Air Force Recruitment 2025: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్..

రెండవసారి, అనిషా 2024 లో తన ఇంట్లోని ఒక గదిలో మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో బిడ్డ ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వారికి ఏమీ వినబడకుండా శిశువు నోరు మూసివేశారు. దీంతో శిశువు మరణించింది. భవిన్ అంబల్లూర్‌లోని తన ఇంటి వెనుక శిశువును పాతిపెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం నాడు భవిన్ స్వయంగా ఇద్దరు శిశువుల ఎముకల అవశేషాలతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఫోరెన్సిక్ దర్యాప్తులో ఇవి మానవ శిశువుల ఎముకలు అని తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.