Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకశాఖలైన.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి బాధ్యతలు తీసుకున్న పవన్.. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇక ఈ రోజు పవన్తో సమావేశం అయ్యారు కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ మరియు సీఈవో బి.రమేష్ బాబు.. ఈ సందర్భంగా.. కరూర్ వైశ్య బ్యాంక్ తరఫున రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి అనే గ్రామంలో తాము చేస్తున్న కార్యక్రమాలను పవన్ కల్యాణ్కు వివరించారు. జల వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణులకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు లాంటివి అక్కడ చేపట్టమనీ, ఇక్కడ కూడా అలాంటివి చేపట్టగలమనే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక, కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రతిపాదనలపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందించాలని, గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారికి తప్పకుండా సహకారం ఇస్తామనిచెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రవాస భారతీయుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని.. వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకూ బాధ్యత కల్పించే అంశంపైన ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, ఈ సమావేశంలో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు ఎన్.మురళీకృష్ణ, కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.