Karnataka Congress crisis: కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. తిరువనంతపురం నుంచి బెంగళూరుకు సాగుతున్న ఈ ప్రయాణం.. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పెద్ద పొలిటికల్ తలనొప్పిగా మారింది. కేరళ కాంగ్రెస్లో దాదాపు 10 రోజుల పాటు సాగిన నాయకత్వ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తెచ్చిన ఆ పార్టీ హైకమాండ్కు, ఇప్పుడు కర్ణాటకలో సరికొత్త డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ల మధ్య కర్ణాటక సీఎం పీఠం కోసం మళ్లీ అగ్గి రాజుకుంది. 2026 ఎన్నికల సీజన్ ముగియడంతో, కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (Reshuffle) చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కావాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు, డి.కె. శివకుమార్ వర్గం ఆయనను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఒత్తిడి పెంచుతోంది. గతంలో అనుకున్న “రెండున్నరేళ్ల ఫార్ములా” (2.5-year promise) పై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ మార్పులపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని డి.కె. శివకుమార్ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
నిజానికి 2023లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఈ అధికార పోరు మొదలైంది. అధిష్టానం సమక్షంలో సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ల మధ్య 50-50 అధికార పంపకాల ఒప్పందం (రెండున్నరేళ్లు ఒకరు, మరో రెండున్నరేళ్లు ఇంకొకరు) జరిగిందని డీకేఎస్ వర్గం గట్టిగా వాదిస్తోంది. మధ్యమధ్యలో తాత్కాలికంగా ఈ వివాదానికి బ్రేకులు పడినప్పటికీ, సీఎం పీఠం కోసం సాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడూ పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల ఏప్రిల్ నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల కారణంగా ఇరు వర్గాలు కాస్త శాంతించాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చేసి, హైకమాండ్ ఎన్నికల విధుల నుంచి ఫ్రీ అవ్వడంతో.. కర్ణాటకలో అణగిమణిగి ఉన్న అసమ్మతి జ్వాలలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. 2025 చివరి నాటికి సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సమయానికి డీకేఎస్ వర్గం ఒత్తిడి తీవ్రం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. కానీ, సిద్ధరామయ్య మాత్రం తానే పూర్తి ఐదేళ్ల కాలం సీఎంగా ఉంటానని, ఎలాంటి పవర్ షేరింగ్ ఒప్పందం లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ద్వారా తన పట్టును మరింత బలోపేతం చేసుకుని అధికారంలో కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తుండగా, నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే వరకు ఆ రీజగ్ను అడ్డుకోవాలని డీకేఎస్ వర్గం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి చేసిన “త్వరలోనే తెర పడుతుంది” అనే వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. “అధిష్టానం మమ్మల్ని త్వరలోనే ఢిల్లీకి పిలుస్తుంది. అక్కడే అంతా తేలిపోతుంది కాబట్టి, నేను ఇక్కడ ఏమీ మాట్లాడను. అవును, త్వరలోనే ఈ వివాదానికి తెర పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.ఎన్. రాజన్న సరికొత్త ట్విస్ట్ ఇస్తూ.. సోమవారం తిరువనంతపురంలో జరిగిన వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పెద్దల మధ్య కర్ణాటక నాయకత్వ మార్పుపై అనధికారిక చర్చలు జరిగాయని చెప్పారు. సిద్ధరామయ్యను గనుక మారిస్తే, హోం మంత్రి జి. పరమేశ్వరను తదుపరి ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న డిమాండ్ చేస్తూ మూడో ముఖాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై పరమేశ్వర స్పందిస్తూ.. రాజన్న తన క్లాస్మేట్ అని, తన తరుపున మాట్లాడినందుకు ధన్యవాదాలంటూనే, అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని తేల్చేశారు. కేరళలో వి.డి. సతీశన్, రమేష్ చెన్నితాల, కె.సి. వేణుగోపాల్ మధ్య నెలకొన్న సీఎం పీఠం సస్పెన్స్ను వీడి, సతీశన్ ప్రమాణ స్వీకారం ముగియగానే.. అధిష్టానం ఫోకస్ మొత్తం మళ్లీ బెంగళూరు వైపు మళ్లింది. డీకేఎస్ వర్గం పోస్టర్లు, సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి పెంచుతోంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను కాపాడి ఐక్యతను చాటగలిగింది కానీ, కర్ణాటకలో మాత్రం ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్ ఇద్దరూ తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో హైకమాండ్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుతానికి కేరళ డ్రామా ముగిసినా.. కర్ణాటక పొలిటికల్ డ్రామా మాత్రం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
