Karimnagar: కరీంనగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు.
అందిన సమాచారం ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించేందుకు వాహనదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 130 కేసుల్లో రూ.20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, కోర్టును కూడా తప్పుదారి పట్టించేలా అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను హాజరుపరిచారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

