Site icon NTV Telugu

Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

Kadapa Police Encounter

Kadapa Police Encounter

Kadapa Police Encounter: కడప జిల్లా ఖాజీపేటలో సంచలనంగా మారిన బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలికను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. సమాచారం ప్రకారం, మైదుకూరు నుంచి నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో బసాపురం చెక్‌పోస్ట్‌ వద్ద వెంకటేష్‌ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేయడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడి కాలికి గాయాలు కాగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులకు గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలని లేదా అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు హైవేపై భారీగా ధర్నా నిర్వహించారు.

సీఎం చంద్రబాబు స్పందన
ఇక, బాలిక గొంతు కోసి చంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను, అధికారులను సూచించారు. మొత్తంగా బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, నిందితుడిపై జరిగిన పోలీసుల కాల్పులు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version